ఒకవైపు సుదీర్ఘ చర్చలు.. మరోవైపు మేమే గెలిచాం అంటున్న ట్రంప్

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్, పాకిస్థాన్‌లతో అమెరికా అత్యున్నత స్థాయి ముఖాముఖి చర్చలు జరుపుతోంది. ఒకవైపు ఇరు దేశాల మధ్య సుదీర్ఘ మంతనాలు జరుగుతుండగా, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం ఫలితంతో సంబంధం లేకుండా అమెరికా ఇప్పటికే వ్యూహాత్మకంగా గెలిచిందని ఆయన స్పష్టం చేశారు.

ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ఈ చర్చలు గత 15 గంటలకు పైగా నిర్విరామంగా కొనసాగుతున్నాయని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ భేటీలో అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో పాటు పలువురు జాతీయ భద్రతా నిపుణులు నాయకత్వం వహిస్తున్నారు. వాషింగ్టన్ నుంచి మరికొందరు నిపుణులు వీరికి సహకారం అందిస్తున్నారు.

మరోవైపు వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఈ చర్చలపై సూటిగా, ఘాటుగా స్పందించారు. "ఫలితం ఎలా ఉన్నా, మేమే గెలుస్తాం. మేము ఆ దేశాన్ని (ఇరాన్‌ను) పూర్తిగా ఓడించాం. వాళ్లు ఒప్పందం చేసుకుంటారో లేదో చూద్దాం. కానీ, అమెరికా కోణంలో చూస్తే మేం గెలిచాం" అని ఆయన అన్నారు.

ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తాము పూర్తిగా నిర్వీర్యం చేశామని ట్రంప్ పేర్కొన్నారు. "మేము వారి నౌకాదళాన్ని, వైమానిక దళాన్ని ఓడించాం. వారి నాయకులందరూ చనిపోయారు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. జలసంధిలో ఉన్న మైన్‌ ప్రమాదాలను తొలగించడానికి అమెరికా దళాలు "మైన్ స్వీపర్లతో" గస్తీ కాస్తున్నాయని కూడా ఆయన తెలిపారు. ఈ చర్చలను ఆర్థిక పరిణామాలతో ముడిపెట్టిన ట్రంప్, అమెరికా వైపు భారీ ట్యాంకర్లు చమురు, గ్యాస్ కోసం వస్తున్నాయని, ఇది చూడటానికి ఎంతో అందంగా ఉందని పేర్కొన్నారు.

చర్చలు జరుగుతున్నప్పటికీ, ఒప్పందం కుదరడంపై ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. "మేము ఇరాన్‌తో లోతైన చర్చలు జరుపుతున్నాం. కానీ మేము ఒప్పందం చేసుకున్నా, చేసుకోకపోయినా నాకు ఎలాంటి తేడా లేదు" అని ట్రంప్ స్ప‌ష్టం చేయ‌డం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.

Donald Trump
Iran
US Iran talks
Pakistan
Islamabad
White House
Jared Kushner
Middle East tensions
US foreign policy
Iran nuclear deal

More Telugu News