ప్రపంచ ఉగ్రవాద సూచీలో ప్రథమస్థానం పాకిస్థాన్‌దే!

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద మరణాలు, దాడుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ, పాకిస్థాన్‌లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది అక్కడ ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో ఏకంగా 1,139 మంది ప్రాణాలు కోల్పోయినట్లు శనివారం విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది.

మొరాకోకు చెందిన జర్నలిస్ట్, పరిశోధకురాలు ఫాతిమా ఎల్ హషిమి 'అమెరికన్ థింకర్' అనే ఆన్‌లైన్ మ్యాగజైన్‌లో ఈ విషయంపై విశ్లేషించారు. పాకిస్థాన్‌లో హింస ఒక సాధారణ విషయంగా మారిపోయిందని, ఇది దేశ భద్రతా వ్యవస్థ తీవ్రంగా క్షీణిస్తోందనడానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. పాక్‌లో ఉగ్రవాదం పెరగడం ఇది వరుసగా ఆరో ఏడాది అని ఆమె గుర్తుచేశారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా మరణాల సంఖ్య పెరిగిందని తెలిపారు.

2025లో జరిగిన దాడుల్లో 74 శాతానికి పైగా, మరణాల్లో 67 శాతం ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులలోనే నమోదయ్యాయని ఫాతిమా వివరించారు. ఈ ప్రాంతాల్లో పాలన, అభివృద్ధి లేకపోవడం వల్లే అంతర్గత సంఘర్షణలకు కేంద్రంగా మారాయని ఆమె అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక వ్యూహం కేవలం సైనిక చర్యలకే పరిమితమైందని, పాలనాపరమైన సంస్కరణలు, తీవ్రవాదాన్ని నిరోధించే ఇతర చర్యలు బలహీనంగా ఉన్నాయని ఫాతిమా విమర్శించారు. కేవలం సైనిక బలంతో కాకుండా రాజకీయ స్పష్టత, సమర్థవంతమైన పాలన, పొరుగు దేశాలతో (ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్‌తో) సత్సంబంధాలు వంటి చర్యలు చేపడితేనే పాకిస్థాన్‌లో శాంతి నెలకొంటుందని ఆమె స్పష్టం చేశారు.

Pakistan
Global Terrorism Index
Terrorism
Khyber Pakhtunkhwa
Balochistan
Fatima El Hashimi
American Thinker
Terrorist Attacks
Afghanistan

More Telugu News