తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది: మంత్రి సీతక్క ఫైర్

తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు అందించిన సెల్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పథకాలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది అంటూ ఘాటుగా హెచ్చరించారు. ములుగులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అంగన్వాడీ టీచర్ల కోసం ఒక్కో సెల్‌ఫోన్‌ను రూ.11,650కే కొనుగోలు చేశామని, కానీ కొందరు రూ.14 వేలకు కొన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని సవాల్ విసిరారు. తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మేడారం జాతర పనుల్లోనూ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. అవసరమైతే దీనిపై సీబీఐ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సీతక్క విమర్శించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు తనను ప్రలోభాలకు గురిచేయాలని చూసినా లొంగలేదని గుర్తుచేశారు. ఎన్నికల్లో తనను ఓడించడానికి వందల కోట్లు ఖర్చుపెట్టి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.

రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందన్న బీఆర్ఎస్
మరోవైపు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఇటీవల మంత్రి సీతక్క శాఖలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'పోషణ్ అభియాన్' కింద 38,130 స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు రూ.54.19 కోట్లతో టెండర్లు పిలిచారని తెలిపారు. టెండర్‌లో 5జీ ఫోన్లు అని పేర్కొని, 4జీ మోడల్ (శాంసంగ్ ఏ06) ఫోన్లను పంపిణీ చేశారని ఆరోపించారు. ఈ ఫోన్‌కు, ప్రభుత్వం టెండర్‌లో రూ.14,215 చెల్లించేలా ఒప్పందం చేసుకుందని విమర్శించారు. ఈ లెక్కన మొత్తం కొనుగోళ్ల విలువ రూ.24 కోట్లు మాత్రమే ఉండాల్సి ఉండగా, అదనంగా చెల్లించి సుమారు రూ.30 కోట్ల అవినీతికి పాల్పడ్డారని క్రిశాంక్ ఆరోపించారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

Seethakka
Danasari Anasuya
Telangana Minister
Anganwadi Cell Phone Scam
Corruption Allegations
BRS
Congress Party
Medaram Jathara
Poshan Abhiyan
Manne Krishank

More Telugu News