అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌పై భారీ టార్గెట్‌ను ఊదేసిన పంజాబ్‌

ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద కొనసాగుతోంది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (69 నాటౌట్‌), ప్రియాన్ష్ ఆర్య (57), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో పంజాబ్ గెలుపు సులువే అనిపించింది. అయితే, సన్‌రైజర్స్ బౌలర్ శివాంగ్ కుమార్ (3/33) ఒకే ఓవర్‌లో వీరిద్దరినీ ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 69 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో బౌండరీలతో విరుచుకుపడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 74) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (38)తో కలిసి తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరి దూకుడుతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేయగలిగినా, బౌలర్ల వైఫల్యంతో ఓటమి తప్పలేదు.

ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. డే/నైట్ మ్యాచ్‌లో 215కు పైగా పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ భారీ ఛేదనతో పంజాబ్ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు కాగా, మరోసారి బౌలింగ్‌లో విఫలమైన సన్‌రైజర్స్ కు నిరాశ త‌ప్ప‌లేదు.

Shreyas Iyer
Punjab Kings
Sunrisers Hyderabad
IPL 2026
Priayansh Arya
Prabhsimran Singh
Abhishek Sharma
Travis Head
Cricket
T20

More Telugu News