కాల్పుల విరమణ తర్వాత... హర్మూజ్‌ దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తాత్కాలికంగా చల్లారడంతో నిలిచిపోయిన నౌకా రవాణా నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తోంది. ఇందులో భాగంగా భారత 'జగ్ విక్రమ్' అనే ఎల్పీజీ ట్యాంకర్ కీలకమైన హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ మార్గంలో ప్రయాణించిన తొలి భారత నౌక ఇదే కావడం గమనార్హం.

షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం... ఈ ట్యాంకర్ ఈరోజు మధ్యాహ్నానికి ఇది ఒమన్ సింధుశాఖలోకి ప్రవేశించి, తూర్పు దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ముంబైకి చెందిన గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ యాజమాన్యంలోని ఈ నౌక, దాదాపు 20,000 టన్నుల ఎల్పీజీని రవాణా చేస్తున్నట్లు వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పశ్చిమాసియా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు హర్మూజ్ జలసంధి ప్రాంతంలో దాదాపు 28 భారత నౌకలు చిక్కుకుపోయాయి. మార్చి ఆరంభం నుంచి ఇప్పటివరకు 9 నౌకలు పర్షియన్ గల్ఫ్ నుంచి బయటపడగా, మరో 15 భారత నౌకలు ఇంకా సురక్షిత మార్గం కోసం ఎదురుచూస్తున్నాయి.

ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో హర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే భారత్ వంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. జగ్ విక్రమ్ ప్రయాణం ఇంధన సరఫరాపై ఆందోళనలను కొంత తగ్గించినప్పటికీ, పలు నౌకలు ఇంకా చిక్కుకొని ఉండటంతో పరిస్థితి పూర్తిగా చక్కబడలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Jag Vikram
LPG Tanker
Hormuz Strait
India
West Asia
Oil Transportation
Shipping
Persian Gulf
Great Eastern Shipping Company
Oman

More Telugu News