బీసీ మహిళల ఉప కోటా కోసం ఢిల్లీని గడగడలాడిస్తాం: కల్వకుంట్ల కవిత

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల స్ఫూర్తితో చట్టసభల్లో బీసీ మహిళలకు ఉప కోటా సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పూలే జయంతి వేడుకల సందర్భంగా బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు స్థానం కల్పించకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీసీ మహిళలకు ఉప కోటా ఇవ్వకపోవడం అంటే పాలకులకు ఆ వర్గాల పట్ల గౌరవం లేదని అర్థమని, కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా మరోసారి పూలే పుట్టారా అన్నట్లుగా జాగృతి ఆధ్వర్యంలో ఉద్ధృత పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.


పార్లమెంట్‌లో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు మహిళా బిల్లుపై జరగనున్న చర్చా సమయంలో తాను స్వయంగా ఢిల్లీకి వెళ్లి వివిధ రాజకీయ పార్టీల నేతలను కలుస్తానని కవిత వెల్లడించారు. కేవలం మెజారిటీ ఉందన్న అహంకారంతో బీసీలకు అన్యాయం చేస్తూ బిల్లును ఆమోదిస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు రాష్ట్రంలో పూలే విగ్రహ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తే... ట్యాంక్ బండ్ వద్ద పెడతామని చెప్పి, ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. కనీసం అంబేద్కర్ జయంతి నాటికైనా ఆ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.


విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యలపై కూడా కవిత ఈ సందర్భంగా గళమెత్తారు. వారి క్రమబద్ధీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి జాగృతి పూర్తి మద్దతు ఇస్తుందని, కొత్తగూడెంలో జరుగుతున్న ఆందోళనల్లో తమ నాయకులు పాల్గొంటారని ప్రకటించారు. గతంలో ఆర్టిజన్ల వేతనాలు పెంచడంలో జాగృతి కీలక పాత్ర పోషించిందని గుర్తు చేస్తూ, ఇప్పుడు వారిపై ప్రభుత్వం చర్యలకు దిగాలని చూడటం సరికాదన్నారు. పూలే చూపిన సామాజిక న్యాయం బాటలో నడుస్తూ అణగారిన వర్గాల హక్కుల కోసం అహర్నిశలు శ్రమించడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Kalvakuntla Kavitha
BC Women Reservation
Women Reservation Bill
Telangana Jagruthi
Mahatma Jyothirao Phule
Parliament
OBC Quota
BC Reservation
Telangana Politics
Women Empowerment

More Telugu News