బెంగాల్ ఉత్సాహం గుజరాత్‌లోనూ చూడలేదు: ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో తన ప్రచార సభలకు వస్తున్న జనాన్ని, వారి ఉత్సాహాన్ని తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా ఎన్నడూ చూడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మధ్యాహ్నం తూర్పు బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంత భారీ సభను గుజరాత్‌లో కూడా ఏర్పాటు చేయలేకపోయేవారమని, మే 4 తర్వాత రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయనడానికి ఈ సభలే నిదర్శనమని అన్నారు.

బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం: మోదీ హామీ
ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ భయాందోళనలు సృష్టిస్తోందని, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా నిలిపివేయబోమని స్పష్టం చేశారు. కేవలం తృణమూల్ నేతల అవినీతి, దోపిడీ దుకాణాలను మాత్రమే మూసివేస్తామని అన్నారు.

తాము అధికారంలోకి వస్తే, కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలోని తొలి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు తీర్మానం చేస్తామని మోదీ ప్రకటించారు. ఇన్నాళ్లూ ఈ పథకాన్ని అమలు చేయకుండా తృణమూల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని, బీజేపీ ప్రభుత్వంతో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు.

చొరబాటుదారులు, వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు
అంతేగాక‌ కొత్త ప్రభుత్వం చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారికి నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి ఇక్కడ స్థిరపడటానికి సహాయం చేసిన వారిని కూడా వదిలిపెట్టబోమ‌ని మోదీ హెచ్చరించారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Narendra Modi
West Bengal Elections
BJP
TMC
Mamata Banerjee
Ayushman Bharat
Corruption
Election Campaign
Political Rally

More Telugu News