హర్మూజ్ జలసంధిలో అమెరికా అత్యంత ఖరీదైన డ్రోన్ అదృశ్యం
అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత ఖరీదైన నిఘా డ్రోన్ 'ఎంక్యూ-4సీ ట్రైటాన్' ఈరోజు హర్మూజ్ జలసంధి సమీపంలో అదృశ్యమవ్వడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో సుమారు మూడు గంటల పాటు నిఘా కార్యకలాపాలు నిర్వహించిన ఈ డ్రోన్, తిరిగి ఇటలీలోని నావల్ ఎయిర్ స్టేషన్ సిగోనెల్లాకు వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫ్లైట్ రాడార్ 24 గణాంకాల ప్రకారం, ఇరాన్ దిశగా స్వల్పంగా మలుపు తిరిగిన తక్షణమే ఈ డ్రోన్ నుంచి 'కోడ్ 7700' (జనరల్ ఎమర్జెన్సీ) హెచ్చరికలు వెలువడ్డాయి. ఆ తర్వాత అత్యంత వేగంగా ఎత్తును కోల్పోతూ రాడార్ పరిధి నుంచి మాయమైంది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం.
సుమారు 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,600 కోట్లకు పైగా) విలువైన ఈ ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్, సముద్ర తీర ప్రాంతాల్లో నిరంతర నిఘా కోసం రూపొందించబడింది. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, 24 గంటల పాటు సుదీర్ఘంగా ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అయితే ఇది సాంకేతిక కారణాలతో కూలిపోయిందా? లేదా ఇరాన్ దళాలు కూల్చివేశాయా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఒకవైపు శాంతి ఒప్పందాలు జరుగుతుండగానే, అమెరికా తన యుద్ధ కార్యకలాపాల కోసం ప్రతి సెకనుకు 10,300 డాలర్లు (సుమారు రూ. 9.8 లక్షలు) ఖర్చు చేస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. కేవలం క్షిపణులు, వాయు, నౌకాదళ కార్యకలాపాల కోసమే రోజుకు వందల కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ అమెరికా ఈ ప్రాంతంలో భారీ సైనిక వ్యూహాన్ని కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన ఈ డ్రోన్ అదృశ్యం ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక శాంతికి విఘాతం కలిగిస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.