గుడివాడ టెక్కీ దారుణ హత్య: హర్యానాలో రక్తపు మడుగులో ఋషికేష్!
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హర్యానాలో దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఉద్యోగ రీత్యా వెళ్లిన కొద్ది రోజుల్లోనే ప్రాణాలు కోల్పోవడంతో బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గుడివాడ బేతవోలు గ్రామానికి చెందిన బండ్ల ఋషికేష్ (27) ఇటీవలే హర్యానాలోని పంచకుల ప్రాంతంలో ఉన్న ఒక ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరారు. విధుల్లో చేరి పది రోజులు కూడా గడవకముందే ఆయన మరణవార్త వినాల్సి రావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
కంపెనీ కేటాయించిన నివాస గదిలోనే ఋషికేష్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న హర్యానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. గుడివాడ వన్టౌన్ పోలీసులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేయడంతో, ఋషికేష్ తండ్రి హుటాహుటిన హర్యానాకు బయలుదేరి వెళ్లారు.
ఈ హత్య వ్యక్తిగత కారణాలతో జరిగిందా? లేక ఆఫీసు గొడవలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొత్త చోట, కొత్త ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.