మావోలకు మరో ఎదురుదెబ్బ.. డీజీపీ ఎదుట లొంగిపోనున్న 30 మంది మావోయిస్టులు
తెలంగాణలో మావోయిస్టుల ఏరివేత, పునరావాస ప్రక్రియలో భాగంగా మరో కీలక అడుగు పడబోతోంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఈరోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు.
రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఇవాళ సుమారు 30 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. లొంగిపోయిన వారిలో కీలక నేతలు ఉన్నారా? వారు ఏ దళానికి చెందినవారు? వంటి పూర్తి వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడిస్తారు.
జనజీవన స్రవంతిలో చేరిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ ఆర్థిక సహాయం, నగదు పురస్కారాలు, పునరావాస సౌకర్యాలను కల్పించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల గస్తీ ముమ్మరం కావడం, గాలింపు చర్యలు పెరగడంతో పాటు ప్రభుత్వ పునరావాస పథకాలపై పెరిగిన అవగాహనే ఈ భారీ లొంగుబాటుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.