భారత క్రికెట్లో విషాదం... అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత... ఆయనే చివరివాడు!

భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. దేశపు అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, మాజీ ఆటగాడు సి.డి. గోపీనాథ్ (96) గురువారం చెన్నైలో కన్నుమూశారు. భారత్ తన మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని నమోదు చేసిన చరిత్రాత్మక జట్టులో జీవించి ఉన్న ఏకైక సభ్యుడు ఆయనే కావడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో దత్తా గైక్వాడ్ మరణంతో, ఆ జట్టులోని చివరి ఆటగాడిగా గోపీనాథ్ మిగిలారు.

చెన్నైలోని అడయార్‌లో ఉన్న తన కుమార్తె నివాసంలో నిద్రలోనే గోపీనాథ్ ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1930 మార్చి 1న మద్రాసులో జన్మించిన ఆయన, కుడిచేతి వాటం బ్యాటర్‌గా దేశవాళీ క్రికెట్‌లో మద్రాస్ జట్టు తరఫున నిలకడగా రాణించి జాతీయ జట్టులో స్థానం సంపాదించారు.

1951-52లో ఇంగ్లండ్‌పై భారత్ చరిత్రాత్మక టెస్ట్ విజయం సాధించడంలో గోపీనాథ్ కీలక పాత్ర పోషించారు. ఆ మ్యాచ్‌లో 35 పరుగులు చేయడమే కాకుండా, వినూ మన్కడ్ బౌలింగ్‌లో కీలకమైన క్యాచ్ అందుకున్నారు. ఆ మ్యాచ్‌లో వినూ మన్కడ్ మొత్తం 12 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

ఆటగాడిగా రిటైర్మెంట్ తర్వాత కూడా గోపీనాథ్ క్రికెట్‌కు సేవలందించారు. మద్రాస్ జట్టుకు కెప్టెన్‌గా, 1970లలో జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా, 1979 ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు మేనేజర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. గోపీనాథ్ మృతి పట్ల తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన వారసత్వం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడింది.

CD Gopinath
Indian cricket
oldest cricketer
Test cricketer
India vs England
Vinoo Mankad
Tamil Nadu Cricket Association
cricket history
Indian cricket team
Chennai

More Telugu News