పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ముహూర్తం ఖరారు!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కావ్య రెడ్డితో ఆయన వివాహం నిశ్చయమవడమే కాకుండా, పెళ్లి ముహూర్తం కూడా ఖరారైంది.
ఇటీవల ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శ్రీనివాస్ - కావ్య రెడ్డిల 'లగ్నపత్రిక' వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సాయి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో, అవి చూసిన అభిమానులు ఈ జంట "చూడముచ్చటగా ఉంది" అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ లగ్నపత్రిక వేడుకలోనే వివాహ ముహూర్తాన్ని ఏప్రిల్ 29గా ఖరారు చేశారు. టాలీవుడ్లోని ప్రముఖులు, రాజకీయ నేతలు, ఇతర రంగాల సెలబ్రిటీల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు బెల్లంకొండ సురేశ్ కుటుంబం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
ఒకవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న శ్రీనివాస్... మరోవైపు సినిమాల పరంగానూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ 'హైందవ'పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. లుధీర్ బైరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.