లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... హెజ్బొల్లా చీఫ్ మేనల్లుడి హతం

లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దాడులను తీవ్రతరం చేసింది. హెజ్బొల్లా చీఫ్ నయీమ్ ఖాసిం మేనలుడు  అలీ యూసఫ్ హర్షీని బీరుట్‌లో హతమార్చినట్లు ఐడీఎఫ్ నేడు ప్రకటించింది. హర్షీ...  నయీమ్ ఖాసింకు వ్యక్తిగత కార్యదర్శి కూడా. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ దాడి జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది.

ఈ మేరకు ‘ఎక్స్’లో ఐడీఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఖాసిం కార్యాలయ నిర్వహణలో, భద్రత కల్పించడంలో హర్షీ కీలక పాత్ర పోషించాడని, అతడు అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత సలహాదారు అని తెలిపింది. ఈ దాడితో పాటు, లిటాని నదికి దక్షిణంగా ఆయుధాలను తరలించడానికి హెజ్బొల్లా ఉపయోగించే రెండు కీలక క్రాసింగ్‌లతో పాటు, దక్షిణ లెబనాన్‌లో 10 ఆయుధ నిల్వ కేంద్రాలు, లాంచర్లు, కమాండ్ సెంటర్లను కూడా ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది.

ఉత్తర ఇజ్రాయెల్ భద్రత విషయంలో రాజీపడబోమని, హెజ్బొల్లాపై దాడులను మరింత కఠినంగా కొనసాగిస్తామని ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఈయల్ జమీర్ స్పష్టం చేశారు. ప్రతి కార్యాచరణ అవకాశాన్ని ఉపయోగించుకుంటామని ఆయన హెచ్చరించారు.

కాగా, లెబనాన్ పై దాడుల వీడియోను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. "మా సందేశం సుస్పష్టం... ఎవరైతే ఇజ్రాయెల్ పౌరులపై దాడులకు పాల్పడతారో వారిని నాశనం చేస్తాం" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

Nayeem Qasim
Hezbollah
Israel
IDF
Lebanon
Ali Youssef Harshe
Beirut
Middle East conflict
Israel Defense Forces
Eyal Zamir

More Telugu News