సౌదీ కీలక ఆయిల్ పైప్‌లైన్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడి

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇరాన్ మళ్లీ తన దూకుడు ప్రదర్శించింది. సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన ముడి చమురు పైప్‌లైన్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడికి పాల్పడింది. ఈ ఘటనతో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.

పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్ర సముద్రంలోని యన్‌బు ఓడరేవుకు చమురును రవాణా చేసే ఈ ‘ఈస్ట్-వెస్ట్’ పైప్‌లైన్ సౌదీకి అత్యంత వ్యూహాత్మకమైనది. సుమారు 1,200 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం, వివాదాస్పద హర్మూజ్ జలసంధిని దాటకుండా చమురు ఎగుమతి చేసేందుకు సౌదీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం. యన్‌బు ప్రాంతంలోని పంపింగ్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) ప్రకటించింది. ఈ ఘటనలో ఒక పంపింగ్ స్టేషన్ వద్ద మంటలు చెలరేగాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించి, చమురు సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన వెంటనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. రోజుకు 70 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా సామర్థ్యం ఉన్న ఈ పైప్‌లైన్ దెబ్బతినడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు మరోసారి ఆకాశాన్నంటే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సౌదీ ప్రభుత్వ చమురు సంస్థ అరామ్‌కో నష్టాన్ని అంచనా వేస్తోంది. అయితే, నష్టం పరిమితంగానే ఉందని, పైప్‌లైన్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోలేదని ప్రాథమికంగా తెలుస్తోంది. ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా జనరల్ డాన్ కెయిన్ హెచ్చరించారు. ఈ ఘటనను అమెరికా రక్షణ శాఖ నిశితంగా గమనిస్తోంది.

Iran
Saudi Arabia oil pipeline attack
Saudi Aramco
East-West pipeline
Yenbo port
oil prices
Donald Trump
Persian Gulf
Hormuz Strait
Dan Kain

More Telugu News