ఇరాన్ మూడు వర్షన్‌లలో ప్రతిపాదనలు పంపింది: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్ మూడు వర్షన్‌లుగా తన 10 పాయింట్ల ప్రతిపాదనలను పంపించిందని, కానీ ఇస్లామాబాద్ వేదికగా ఈ నెల 11న జరగనున్న చర్చలకు ఏది ప్రాతిపదికగా ఉంటుందనే విషయంలో స్పష్టత లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా 14 రోజుల పాటు కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పంపించిన మూడు వర్షన్‌లలో ఒక దానిని చాట్‌జీపీటీ రాసిందని విమర్శించారు. ఇరాన్ నుంచి వచ్చిన మూడు వేర్వేరు ప్రతిపాదనలు గందరగోళాన్ని సృష్టించాయని అన్నారు. మొదట 10 పాయింట్లతో ఒక ప్రతిపాదన పంపించిందని, అయితే అది చాట్‌జీపీటీ రాసినట్లుగా ఉందని జేడీ వాన్స్ అన్నారు. అలాగే పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జార్డ్ కుష్నర్‌లకు ఆ ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. వారు వెంటనే వాటిని తిరస్కరించారని వెల్లడించారు.

ఇరాన్ ప్రతిపాదనకు సంబంధించి మరో వర్షన్ కూడా వచ్చిందని, అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనలో దానినే ప్రస్తావించారని తెలిపారు. ప్రతిపాదనలకు సంబంధించిన మూడో వర్షన్ అయితే ఏమాత్రం అంగీకరించలేనిదిగా ఉందని అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారానే మూడో ప్రతిపాదన తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. లెబనాన్ ఘటనను చూపిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కాకుండా చూసే బాధ్యత ఇరాన్‌దే అన్నారు.

ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో అమెరికా బృందం చర్చల్లో పాల్గొంటుంది.

JD Vance
Iran
US Iran talks
Islamabad talks
West Asia ceasefire
Trump
Steve Witkoff
Jared Kushner

More Telugu News