అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు.. రూ.2,534 కోట్లతో కేంద్ర సచివాలయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపడంతో నిర్మాణ కార్యకలాపాల్లో కదలిక మొదలైంది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మొత్తం రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.1,299.08 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం సెంట్రల్ సెక్రటేరియట్, రూ.1,234.91 కోట్లతో ఉద్యోగుల కోసం నివాస సముదాయాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సీఆర్డీఏ ఇప్పటికే 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సచివాలయం, మిగిలిన 17 ఎకరాల్లో నివాస భవనాలు నిర్మిస్తారు. కేంద్ర గృహ నిర్మాణ శాఖ పంపిన ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మరోవైపు, అమరావతిలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కూడా ఖరారైంది. ఇక్కడి రాయపూడిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 787 సెంట్ల భూమికి సంబంధించిన లీజు అగ్రిమెంట్‌ ప్రక్రియ బుధవారం పూర్తయింది. సీఆర్డీఏ, కాగ్ అధికారుల మధ్య ఒప్పంద పత్రాల మార్పిడి జరిగింది. ఇదే క్రమంలో, 10 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని హడ్కో కూడా ఆసక్తి చూపడం విశేషం.

Amaravati
Andhra Pradesh
Central Secretariat
CPWD
Housing Project
Nirmala Sitharaman
Pemmamsani Chandrasekhar
CAG office
HUDCO

More Telugu News