బెంగాల్‌లో లక్షలాది ముస్లిం ఓట్లను న్యాయపరిశీలనలో ఉంచారు: అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం

పశ్చిమ బెంగాల్‌లో ఆయా నియోజకవర్గాల్లో పెద్ద మొత్తంలో ముస్లింల పేర్లను న్యాయ పరిశీలన జాబితాలో ఉంచడంపై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంషేర్‌గంజ్ నియోజకవర్గంలో 55 శాతం మంది ముస్లింలు, మోతాబరిలో 54.2 శాతం, మణిక్‌చక్‌లో 50 శాతం, బెర్హంపూర్‌లో 61.6 శాతం మంది ముస్లింల పేర్లు పరిశీలన జాబితాలో నిలిచిపోయాయని ఆరోపించారు.

రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో లక్షలాది మంది ముస్లింల ఓటు హక్కును ప్రశ్నార్థకంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి ఓటు హక్కు విషయమై 'ఫారెనర్స్ ట్రైబ్యునల్' ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. ఆ నిర్ణయం వెలువడే వరకు వారు ఓటు వేయలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల లోపు 'ఫారెనర్స్ ట్రైబ్యునల్' సభ్యులను ఏర్పాటు చేసి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. తమ పేర్లు గల్లంతయ్యాయని లక్షలాది మంది ఓటర్లు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకోవడం ద్వారా అందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.

Asaduddin Owaisi
West Bengal Elections
Muslim Voters
Voter List
Foreigner Tribunal
Election Commission of India

More Telugu News