కాల్పుల విరమణకు అంగీకారం... గంటల్లోనే ఇరాన్ కీలక ఆయిల్ రిఫైనరీపై దాడి

కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు వార్తలు వెలువడిన కొన్ని గంటలకే, లావన్ ద్వీపంలోని ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది. ఇక్కడి చమురు శుద్ధి కేంద్రాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. టెహ్రాన్ కూడా ప్రతీకార దాడులు నిర్వహించింది. యూఏఐ, కువైట్‌లపై క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడింది.

నేషనల్ ఇరానియన్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (ఎన్ఐఓఆర్డీసీ) కంపెనీ లావన్‌పై దాడిని ధృవీకరించింది. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. చెలరేగిన మంటలను అదుపు చేయడానికి వెంటనే భద్రతా మరియు అగ్నిమాపక సిబ్బంది బృందాలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలోని సిబ్బందిని సకాలంలో తరలించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఎన్ఐఓఆర్డీసీ తెలిపింది.

ఇరాన్ జాతీయ ఇంధన సరఫరా మరియు పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్ఐఓఆర్డీసీ స్పష్టం చేసింది. అయితే పౌరులు ఇంధన వినియోగాన్ని నియంత్రించుకోవాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని, వీలైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని కోరింది.

కువైట్‌లోని పలు చమురు, విద్యుత్ క్షేత్రాలపై దాడులు జరిగాయి. దాదాపు 28 ఇరాన్ డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుందని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. చమురు శుద్ధి కేంద్రాలు, విద్యుత్ ప్లాంట్లపై డ్రోన్ దాడులు జరగడంతో భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాలపై కూడా క్షిపణి దాడులు జరిగాయి.

Iran
Iran oil refinery attack
oil refinery attack
Lavon Island
Kuwait
UAE
drone attacks
missile attacks

More Telugu News