నారా లోకేశ్ 87వ రోజు ప్రజాదర్బార్... సమస్యలపై వెల్లువెత్తిన వినతులు

రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గ్యాలా డిపోను తరలించవద్దని సిబ్బంది మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకునేందుకు రీప్లేస్‌మెంట్ వాహనాలను ఇప్పించాలని హైర్ బస్సుల యజమానులు కోరారు.

కర్నూలు జిల్లా, గూడెంపాడుకు చెందిన ఎస్. చిన్న శివమ్మ అనే మహిళ తన వారసత్వ ఆస్తి అయిన 2.63 ఎకరాల భూమిని కొందరు కబ్జా చేశారని, దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని మంత్రిని అభ్యర్థించారు. ప్రజలు సమర్పించిన వినతులను సావధానంగా విన్న లోకేశ్, వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Nara Lokesh
Praja Darbar
TDP
Mangalagiri
Andhra Pradesh
Public Grievances
South Coast Railway
Vijayawada
Kurnool
Land Dispute

More Telugu News