మూడేళ్లలో అమరావతి నిర్మాణం ఎలా సాధ్యం?: తమ్మినేని సీతారాం
అమరావతి రాజధాని నిర్మాణం ఆచరణ సాధ్యం కాదని, అది కేవలం కూటమి ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందని వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం విమర్శించారు. తాడేపల్లిలో జగన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన, రాజధాని విషయంలో ప్రస్తుత ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
అమరావతి నిర్మాణానికి రూ. 2 లక్షల కోట్లు అవసరమని, కేవలం మూడేళ్లలో ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అసలు రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడమే ఒక పెద్ద తప్పని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' ప్లాన్కు తమ్మినేని పూర్తి మద్దతు తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన మౌలిక వసతులు కల్పించే అవకాశం ఉన్న ఈ కారిడార్ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భారీ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పకుండా అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆచరణాత్మకమైన పరిష్కారాల వైపు వెళ్లాలని ఆయన సూచించారు.