ఐదో రోజూ కొనసాగిన బుల్ రన్... భారీగా పెరిగిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ భారీ లాభాలతో దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, దేశీయంగా స్థిరమైన విధాన నిర్ణయాలు వెలువడటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు బలమైన లాభాలను నమోదు చేశాయి.

బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 2,946.32 పాయింట్లు పెరిగి 77,562.90 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ 873.70 పాయింట్లు లాభపడి 23,997.35 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా, ఇరాన్‌పై దాడిని రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్లకు కలిసొచ్చింది.

టెక్నికల్ పరంగా చూస్తే, నిఫ్టీకి 23,700 - 23,600 జోన్ తక్షణ మద్దతు స్థాయిగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ స్థాయిని కోల్పోతే లాభాల స్వీకరణకు అవకాశం ఉందని, అదే సమయంలో ప్రస్తుత ర్యాలీ కొనసాగాలంటే 24,500 నిరోధక స్థాయిని కచ్చితంగా దాటాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

ఈ ర్యాలీలో ప్రధాన సూచీలతో పాటు బ్రాడర్ మార్కెట్లు కూడా పాల్గొన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 4.03 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 4.39 శాతం చొప్పున పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆటో సూచీలు అత్యధిక లాభాలను నమోదు చేయగా, ఐటీ రంగం మాత్రం వెనుకబడింది. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతు లభించింది.

దేశీయంగా, ఏప్రిల్ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్లకు స్థిరత్వాన్ని ఇచ్చింది. రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించాలని ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయించింది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి.

Stock Market
Sensex
Nifty
Indian Stock Market
Market Indices
Share Market
RBI
Reserve Bank of India
Donald Trump
Stock Market Analysis

More Telugu News