ఏపీలో ఈ-బస్సులు... సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో రహదారులను గుంతలు లేకుండా పటిష్ఠంగా తీర్చిదిద్దాలని, ప్రజా రవాణాకు తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో బుధవారం ఆయన రహదారులు, భవనాలు (ఆర్ అండ్ బీ), రవాణా శాఖల పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. కేవలం మరమ్మతులు చేయడమే కాకుండా, ఆయా ప్రాంతాల్లోని భౌగోళిక పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా నాణ్యమైన రోడ్లను నిర్మించాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారానే ప్రజలకు మౌలిక సదుపాయాలు చేరువవుతాయని, తద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజా రవాణా వ్యవస్థపైనా సమీక్షలో చర్చించారు. సామాన్యులపై భారం తగ్గించేలా, అతి తక్కువ వ్యయానికే ప్రయాణం సాగించేందుకు వీలుగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Andhra Pradesh
AP Roads
Electric Buses
RTC
Road Development
Public Transport
Krishna Babu
BC Janardhan Reddy
Mandipalli Ramprasad Reddy

More Telugu News