సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. రెండు వారాల పాటు తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కూడా స్వాగతించింది. అయితే, గంటల వ్యవధిలోనే ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. తమ నగరాలపైకి క్షిపణులు ప్రయోగించిందని, వాటిని మధ్యలోనే తమ బలగాలు అడ్డుకుని కూల్చేశాయని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో ఇజ్రాయెల్ సైన్యం హైఅలర్ట్ ప్రకటించింది.

గంట వ్యవధిలోనే ఇరాన్ మూడుసార్లు క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ధ్రువీకరించింది. ఈ దాడులను ఎదుర్కొనేందుకు తమ రక్షణ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తున్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలన్న షరతుతో ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై దాడులను ట్రంప్ రెండు వారాల పాటు వాయిదా వేశారు. ఈ ఒప్పంద ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ దాడులకు దిగడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.

ఈ దాడుల వల్ల జెరూసలేం, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. జెరూసలేంకు దక్షిణంగా ఉన్న టెల్ షెవ్ పట్టణంలో ఇద్దరు 15 ఏళ్ల బాలురు స్వల్పంగా గాయపడినట్లు ‘మాగెన్ డేవిడ్ అడొమ్’ అత్యవసర సేవా సంస్థ తెలిపింది. సైనిక హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ వెంటనే బాంబు షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శాంతి దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఇరాన్ ఈ దాడులకు పాల్పడటంతో పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇరాన్ వైఖరిపై ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Iran
Israel
Iran Israel conflict
missile attacks
ceasefire agreement
Jerusalem
West Bank
Tel Shev
Hormuz Strait
IDF

More Telugu News