వికటించిన దోశల పిండి.. ఇద్దరి మృతి!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుకాణంలో కొనుగోలు చేసిన పిండితో చేసిన దోశలు తిని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మరణించారు. వారి తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విమల్ అనే వ్యక్తి ఏప్రిల్ 1న స్థానికంగా ఉన్న ఘనశ్యామ్ డెయిరీలో దోశ పిండి (ఖిరు) కొనుగోలు చేశారు. మరుసటి రోజు ఉదయం ఆ పిండితో చేసిన దోశలను విమల్, ఆయన భార్య భావన, నాలుగేళ్ల పెద్ద కుమార్తె తిన్నారు. ఆ తర్వాత కాసేపటికే ముగ్గురికీ వాంతులు మొదలయ్యాయి. తల్లి పాలు తాగిన మూడు నెలల చిన్నారి కూడా అస్వస్థతకు గురైంది. దీంతో నలుగురినీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏప్రిల్ 3న మూడు నెలల చిన్నారి, ఏప్రిల్ 5న నాలుగేళ్ల బాలిక మృతి చెందారు. ప్రస్తుతం విమల్, భావన పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.

ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఘనశ్యామ్ డెయిరీ నుంచి పిండి నమూనాలను సేకరించి, పరీక్షల కోసం ఫుడ్ అండ్ సెక్యూరిటీ ల్యాబొరేటరీకి పంపారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే మరణాలకు కచ్చితమైన కారణం తెలుస్తుందని ఓ సీనియర్ పోలీస్ అధికారి ఇండియా టుడేకు తెలిపారు.

మరోవైపు, డెయిరీ యజమాని ఘనశ్యామ్ షా ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఏప్రిల్ 1న తాను సుమారు 100 కిలోల పిండిని విక్రయించానని, ఇతర కస్టమర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. ఈ వార్త తెలిశాక, పిండి కొన్న పలువురు కస్టమర్లకు ఫోన్ చేసి ఆరా తీసినా ఎలాంటి సమస్య లేదని చెప్పినట్లు ఆయన వివరించారు. కాగా, విమల్ కుటుంబం 3 కిలోల పిండి కొనుగోలు చేయగా, అందులో 300 గ్రాములు మాత్రమే వాడినట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.

Ahmedabad Dosa Tragedy
Ahmedabad
Dosa
Food Poisoning
Gujarat
Children Death
Ghanshyam Dairy
Vimal
Food Safety

More Telugu News