ఇరాన్ కీలక ఖర్గ్ ఐలాండ్‌పై మరోసారి బాంబుల వర్షం.. ఇక ఆగేది లేదన్న ఇరాన్

ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్ ఐలాండ్‌పై మరోసారి దాడులు జరిగాయి. ఖర్గ్‌తో పాటు ఆ దేశంలోని రహదారులు, రైల్వే వంతెనలపై భారీగా దాడులు జరిగాయి. ఇక్కడి మిలిటరీ లక్ష్యాలపై అమెరికా-ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి. గత నెలలోనూ అమెరికా ఈ ప్రాంతంపై దాడులు చేసింది. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గడువు విధించిన విషయం తెలిసిందే.

తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇన్నాళ్లూ యుద్ధం ముగింపు గురించి ఓపికతో ఎదురు చూశామని, ఇక తమ సహనం నశించిందని ఇరాన్ వ్యాఖ్యానించింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా వాటి మిత్ర దేశాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఆయా దేశాల్లోని అమెరికా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. చమురు, గ్యాస్ సరఫరాకు ఏళ్ల తరబడి అంతరాయం కలిగిస్తామని తెలిపింది.

ఖర్గ్ ద్వీపం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉంది. ఇరాన్ తీరానికి 25-30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకం. ఇరాన్ దేశం తమ చమురు ఎగుమతుల్లో 90 శాతం ఇక్కడి నుంచే నిర్వహిస్తోంది. హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఖర్గ్‌ను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇందులో భాగంగా ఖర్గ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అదనపు బలగాలను మోహరించింది. ఇక్కడ అమెరికా భూతలదాడులకు దిగే అవకాశం కూడా ఉందని అంచనాలు ఉన్నాయి.

Kharg Island
Iran
Kharg Island bombing
Iran attacks
US Israel attacks
Persian Gulf
Hormuz Strait

More Telugu News