ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్ల దూకుడు... చివరి గంటలో కొనుగోళ్ల జోరు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల బాటలో పయనించాయి. ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 507.73 పాయింట్లు పెరిగి 74,616.58 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 155.40 పాయింట్లు లాభపడి 23,123.65 వద్ద ముగిసింది.

రేపు బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో, ఇవాళ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆరంభంలో ఆచితూచి సాగినప్పటికీ, చివరి సెషన్‌లో ఐటీ, మెటల్ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. దీంతో మార్కెట్లు లాభాలను నిలబెట్టుకున్నాయి. నిఫ్టీలో విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్ అత్యధికంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. 

ఈసారి కూడా ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా ఉంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ, భవిష్యత్ విధానాలపై ఆర్బీఐ గవర్నర్ చేసే వ్యాఖ్యల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక రంగాల వారీగా చూస్తే ఐటీ, రియల్టీ, మెటల్ సూచీలు రాణించాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అత్యధికంగా నష్టపోయింది. బ్రాడర్ మార్కెట్‌లో మిశ్రమ స్పందన కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.20 శాతం స్వల్పంగా లాభపడగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.06% మేర నష్టపోయింది. నిఫ్టీకి 23,000 వద్ద తక్షణ మద్దతు ఉందని, 23,500-23,600 స్థాయి వద్ద నిరోధం ఎదురుకావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

RBI
Reserve Bank of India
Stock Market
Sensex
Nifty
MPC
Repo Rate
Indian Economy
Share Market
Wipro

More Telugu News