దేశం కోసం నేను, నా ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. దేశానికి చెందిన 14 మిలియన్లకు పైగా ఇరాన్ ప్రజలతో పాటు తానూ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. కాల్పుల విరమణకు పలు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని అన్నారు. ఇరాన్ కోసమే నిలబడ్డాను, ఇక ముందు కూడా నిలబడతానని పేర్కొన్నారు.

ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఆ దేశంలోని అనేక స్థావరాలను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈసారి డెడ్‌లైన్ పొడిగింపు ఉండదని, ఇరాన్‌ను తమ బలగాలు ఒక్క రాత్రికే తుడిచి పెట్టేయగలవని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ధీటుగా స్పందించారు. అమెరికా తాత్కాలిక ఒప్పందాలకు అంగీకరించబోమని, తమ శాశ్వత డిమాండ్లు అంగీకరించాలని చెబుతోంది. తాను, తమ దేశ ప్రజలు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Masoud Pezeshkian
Iran
Iranian President
Iran President
Hormuz Strait
Trump
Iran US relations

More Telugu News