అఖండ భారత్‌లో భాగం కావొద్దు: యూఏఈకి పాక్ మంత్రి సలహా

భారతదేశంపై పాకిస్థాన్ మంత్రి ముషాహిద్ హుస్సేన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారతీయులు ఎక్కువగా ఉన్నందున ఆ దేశం జాగ్రత్తగా ఉండాలని, అఖండ భారత్‌లో భాగం కాకుండా చూసుకోవాలని వ్యాఖ్యానించారు.. అదే యూఏఈ అభివృద్ధిలో పాకిస్థాన్ పాత్ర చాలా ఉందని పేర్కొన్నారు.

ఆయన ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ, యూఏఈని విలన్‌గా, బలహీనమైనదిగా అభివర్ణించారు. పాకిస్థాన్‌కు ఆర్థికంగా యూఏఈ దీర్ఘకాలంగా మద్దతు ఇస్తోంది. ఈ నేపథ్యంలో, దీర్ఘకాలంగా ఆ దేశం నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని పాకిస్థాన్ నిర్ణయించిందని తెలిపారు.

యూఏఈకి ఇప్పుడు డబ్బు అవసరమని, ఒకవేళ వారికి ఇబ్బందికర పరిస్థితి ఉంటే పెద్దన్నగా పాకిస్థాన్ ఆ దేశానికి సహాయం చేస్తుందని ఎగతాళి చేశారు. యూఏఈ నిర్మాణంలో పాకిస్థాన్ పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ గల్ఫ్ దేశానికి పాకిస్థాన్ ఎప్పుడూ సహకారిగా ఉందని అన్నారు. ఆ దేశం నిర్మాణంలో పాకిస్థాన్ భాగస్వామ్యం కూడా ఉందని అన్నారు.

ఇదిలా ఉంచితే, యూఏఈతో భారత్ సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉన్నందున యూఏఈ జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. "నేను యూఏఈకి ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీ దేశ జనాభా 10 మిలియన్లు కాగా, అందులో 4.3 మిలియన్లు భారతీయులే. దయచేసి జాగ్రత్తగా ఉండండి. భారతదేశంతో మీ స్నేహం పెరుగుతున్నందున మీరు అఖండ భారత్‌లో భాగం కాకుండా జాగ్రత్త వహించండి" అని అన్నారు.

Mushahid Hussain
Pakistan Minister
UAE
India
Akhand Bharat
India UAE relations
Pakistan UAE relations

More Telugu News