Mallu Bhatti Vikramarka: అధికారం అంటే గొప్ప బాధ్యత: మల్లు భట్టి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా పిప్రి బహిరంగ సభలో మాట్లాడుతూ, 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నామని, తమకు అధికారం అంటే హోదా కాదు, బాధ్యత అని ఆయన అన్నారు. కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లను రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు.
ప్రతి కుటుంబానికి వర్తించేలా రూ. 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని తీసుకువచ్చామని, ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వేగంగా సాగుతోందని చెప్పారు. సామాజిక అంతరాలు లేని సమాజం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్' నిర్మిస్తున్నామని తెలిపారు. ఆదాయాన్ని సృష్టించి, ఆ సంపదను ప్రజలకే పంచడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నాడు పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేస్తామని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.