Revanth Reddy: త్వరలోనే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం: రేవంత్ రెడ్డి

ఎన్నికలకు ముందు పీపుల్స్ మార్చ్ పేరుతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పిప్రి నుంచే మొదలయిందని... ఇక్కడి ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ఆయన వరాల జల్లు కురిపించారు.


గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలను నిర్బంధించే సంస్కృతి ఉండేదని, కానీ తమ 'ప్రజాపాలన'లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా వేదికలపై మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. పార్టీలకు అతీతంగా, తమ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో కూడా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. 


త్వరలోనే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం రాబోతోందని, వీలైతే జూన్ 2వ తేదీన దీనికి శిలాఫలకం వేస్తామని ప్రకటించారు. వేలాది ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామని, దీని ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.


తమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని, ఇందుకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో త్వరలోనే యూనివర్సిటీని నిర్మిస్తామని, అలాగే బాసర క్షేత్రాన్ని దేశంలోనే గొప్పగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఇప్పటివరకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం వేగంగా కొనసాగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2027 మార్చి వరకు జిల్లాల సరిహద్దు మార్పులకు అవకాశం లేదని, ఆ తర్వాత జ్యుడీషియల్ కమిషన్ వేసి బోథ్ రెవెన్యూ డివిజన్ వంటి డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు.

Revanth Reddy
Adilabad Airport
Telangana
Pranahita Project
Uttam Kumar Reddy
Basara Temple
Free Bus Travel
Indiramma Houses
Telangana Development
পিপলস মার্চ

More Telugu News