Kakani Govardhan Reddy: 'మావిగన్'పై ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి ప్రభుత్వానికి భయం పట్టుకుంది: కాకాణి

వైసీపీ నాయకుల వ్యక్తిగత జీవితాలు, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, ఏబీఎన్ రాధాకృష్ణపై ధ్వజమెత్తారు.


వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన 'మావిగన్'పై ప్రజల్లో జరుగుతున్న చర్చను చూసి కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని కాకాణి విమర్శించారు. ఆ చర్చను పక్కదారి పట్టించేందుకే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.


ఏబీఎన్ రాధాకృష్ణ తన 'కొత్త పలుకు' ద్వారా వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా మహిళలపై విషం చిమ్ముతున్నారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ దళారీ పనులు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం మహిళల వ్యక్తిగత జీవితాలను కించపరచడం అత్యంత నీచమైన చర్య అని, దీనిని రాష్ట్రంలోని మహిళా లోకం ఛీత్కరించుకుంటోందని పేర్కొన్నారు.


జగన్‌ను ఎంత ఎక్కువగా దూషిస్తే కూటమి ఎమ్మెల్యేలకు అంత మెరుగైన ర్యాంకింగ్స్ ఇస్తామని చంద్రబాబు టార్గెట్లు పెట్టారని కాకాణి ఎద్దేవా చేశారు. జగన్‌ను తిట్టడమే వారి లక్ష్యంగా మారిందని అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియాలో వైసీపీపై నెగెటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నారని, ఇదంతా ప్రజల దృష్టిని మళ్లించేందుకేనని ఆయన ఆరోపించారు.


రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి క్షుద్ర విద్యలు ప్రదర్శిస్తున్నారని, త్వరలోనే మళ్లీ వైఎసీపీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కాకాణి ధీమా వ్యక్తం చేశారు.

Kakani Govardhan Reddy
YCP
Mavigun
ABN Radhakrishna
Chandrababu Naidu
Andhra Pradesh Politics
YS Jagan
TDP
Political Criticism
Nellore

More Telugu News