Bandi Sanjay: బండి సంజయ్ పై వేముల వీరేశం తీవ్ర విమర్శలు
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని సమర్థిస్తూ, బీజేపీ వైఖరిని ఆయన తప్పుబట్టారు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ప్రజల తరఫున సీఎం మాట్లాడుతుంటే, కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఆ నష్టాన్ని అడ్డుకుంటామని చెప్పాల్సింది పోయి, సీఎంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశభక్తి కేవలం తనకే ఉన్నట్లు బండి సంజయ్ మాట్లాడుతున్నారని... కానీ, దేశం కోసం రక్తాన్ని ధారపోసిన చరిత్ర గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీదని ఆయన గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వాస్తవాలకు బీజేపీ నాయకులు భయపడుతున్నారని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా పనిచేయాలని, పని చేయడం చేతకాకపోతే సీఎంతో కలిసి పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రిపై అనవసర విమర్శలు మానుకోవాలని, వాస్తవాలను గ్రహించి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాలని హితవు పలికారు.