Gautam Kumar: డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!

అక్రమాస్తుల కేసులో సస్పెండైన బీహార్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) గౌతమ్ కుమార్ ఉదంతంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.80 కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఆయనకు ఉచ్చు మరింత బిగుస్తోంది. ఆర్థిక నేరాల విభాగం (EOU) అధికారులు జరిపిన దర్యాప్తులో.. ఆయన తన భార్య, ప్రియురాలితో పాటు ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరిట కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది.

ఆయన చివరిగా కిషన్‌గంజ్‌లో ఎస్‌డీపీవోగా పనిచేసినప్పుడు ఈ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇంట్లో పనిచేసే పారో అలియాస్ పూజ అనే పనిమనిషి ఇంటి పనులకు ఏకంగా థార్ వాహనంలో వచ్చేదని దర్యాప్తులో తేలడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె పేరు మీద డీఎస్పీ పలు ప్లాట్లు కొనుగోలు చేయడంతో పాటు, ఓ బుల్లెట్ మోటార్‌సైకిల్‌ను కూడా బహుమతిగా ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి. ఆమెతో ఆయనకు అక్రమ సంబంధం కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ప్రకారం.. డీఎస్పీ తన భార్య రూబీ, ప్రియురాలు, అత్త పూనమ్ దేవి, కుమారుడు సిద్ధార్థ్ గౌతమ్ పేర్లతో మొత్తం 16 ప్లాట్లను కొనుగోలు చేసినట్లు ఈవోయూ వర్గాలు తెలిపాయి. ఆయనకు మూడు ఎస్‌యూవీలు ఉండగా, వాటిలో ఒకటి అత్తగారి పేరు మీద, ఒక ట్రక్కు ప్రియురాలి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి.

అవినీతి కేసు నమోదు కావడంతో ఇప్పటికే సస్పెండైన గౌతమ్ కుమార్ పై మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా విచారణ జరిపే అవకాశం ఉంది. బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, నేపాల్‌లో ఆయన పెట్టిన బినామీ పెట్టుబడులపై అధికారులు దృష్టి సారించారు. కాగా, ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి పనిమనిషి పారో పరారీలో ఉంది. 1994లో ఇన్స్‌పెక్టర్‌గా చేరిన గౌతమ్, డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు బయటపడతాయని ఈవోయూ ఏడీజీ నయ్యర్ హస్నైన్ ఖాన్ తెలిపారు.
Gautam Kumar
Bihar DSP
corruption case
illegal assets
money laundering
EOU investigation
Puro alias Pooja
Bihar police
Enforcement Directorate
Benami investments

More Telugu News