Pushpagiri: షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి

కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లిన ముగ్గురు యువకులు పెన్నా నదిలో మునిగిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. కడప జిల్లా వల్లూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుష్పగిరి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.

కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు 'ఫ్రంట్‌లైన్ ప్రెస్' పేరుతో ఒక బృందంగా ఏర్పడి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. వీరంతా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. ఆదివారం చిత్రీకరణ కోసం పుష్పగిరి వద్దనున్న పెన్నా నది వద్దకు వెళ్లారు. వారిలో హరిబాబు (25), హర్షవర్ధన్ (22), కృష్ణచైతన్య (20) చిత్రీకరణలో భాగంగా నదిలోకి దిగారు. అయితే, అక్కడ నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి చిక్కుకుని ముగ్గురూ కొట్టుకుపోయారు.

గట్టున ఉన్న స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వల్లూరు ఎస్ఐ శివనాగిరెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే హర్షవర్ధన్, హరిబాబు మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. చీకటి పడటంతో గల్లంతైన కృష్ణచైతన్య కోసం గాలింపును నిలిపివేశారు.

మృతుడు హర్షవర్ధన్, గల్లంతైన కృష్ణచైతన్య కడప కేఎస్ఆర్‌ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. హరిబాబు ఓ హోమియోపతి కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆ ప్రాంతంలో సుడిగుండాలు ఉంటాయని, ప్రమాదకరమని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా యువకులు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pushpagiri
Penna River
short film
Andhra Pradesh
youth drowned
KSRM College
Kadapa
river accident
drowning accident
Frontline Press

More Telugu News