Venkateswara Swamy Temple: వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి 33.5 ఎకరాలు కేటాయించిన నెదర్లాండ్స్ ప్రభుత్వం

ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ మరో కీలక ముందడుగు వేసింది. యూరప్ దేశమైన నెదర్లాండ్స్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)తో కలిసి పనిచేసేందుకు శ్రీకారం చుట్టింది.

ఈ ఆలయ నిర్మాణం కోసం నెదర్లాండ్స్ ప్రభుత్వం ఇప్పటికే 33.5 ఎకరాల భూమిని వీహెచ్‌పీకి కేటాయించింది. ఈ స్థలంలో సుమారు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. ఈ బృహత్కార్యానికి టీటీడీ సహకారం కోరుతూ వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షులు అశోక్‌ కుమార్‌, టీటీడీ ఛైర్మన్‌ను సంప్రదించారు.

ఈ విషయంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ, "గోపురాలు, ప్రాకారాలతోపాటు శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మించనున్న నేపథ్యంలో, టీటీడీ నుంచి స్థపతి సహకారం అందించాలని విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షులు అశోక్‌ కుమార్‌ కోరారు. ఈ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని తెలియజేశాం" అని వివరించారు. ఈ నిర్ణయంతో విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
Venkateswara Swamy Temple
TTD
Netherlands
Vishwa Hindu Parishad
VHP
Chandrababu Naidu
BR Naidu
Temple Construction
Hindu Dharma
Ashok Kumar

More Telugu News