Dhurandhar 2: 'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'ధురంధర్ 2': రానా ఆసక్తికర వ్యాఖ్యలు!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘ధురంధర్ 2’ ప్రభంజనం కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం, తాజాగా ‘బాహుబలి’ నెలకొల్పిన రికార్డులను సైతం అధిగమించడం విశేషం.
నార్త్ అమెరికాలో సుదీర్ఘ కాలంగా ‘బాహుబలి’ పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును ‘ధురంధర్ 2’ తాజాగా బ్రేక్ చేసింది. ఈ చిత్రం ఇప్పటికే రూ. 1,500 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ఇండియాలోనే ఈ సినిమా రూ. 1,100 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఈ విజయంపై రానా స్పందిస్తూ... "'ధురంధర్ 2' సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. బాహుబలి రికార్డును ఇది సొంతం చేసుకోవడం గొప్ప విషయం. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి, ఎన్నో రికార్డులు తిరగరాయాలి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా, దేని ప్రత్యేకత దానిదే" అని పేర్కొన్నారు. కొరియన్ సినిమాల తరహాలో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే స్థానిక కథలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని ఆయన విశ్లేషించారు.
అత్యంత వేగంగా ఈ స్థాయి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘ధురంధర్ 2’పై ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ చిత్ర విజయాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.