Kavitha Kalvakuntla: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ.. సీఎంపై కవిత విమర్శలు
తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్రంలోని 12,061 ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు 25-30 శాతం పెంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఫీజు నియంత్రణ చట్టం గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అసెంబ్లీలో ఆ అంశాన్ని విస్మరించడం సరికాదని విమర్శించారు.
ఫీజుల నియంత్రణకు వెంటనే ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి చట్టం తేవాలని ఆమె డిమాండ్ చేశారు. యాజమాన్యాలు ఫీజులు పెంచుతున్నా, టీచర్ల జీతాలు మాత్రం పెంచడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పాఠశాలల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. విద్యా సంస్థల్లో తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని శాఖలకు ముఖ్యమంత్రే మంత్రిగా ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యమని కవిత వ్యాఖ్యానించారు.