Rajendra: పెళ్లి దుస్తులు ధరించి దంపతుల ఆత్మహత్య

మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువ జంట పెళ్లి దుస్తులు ధరించి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలు గర్భవతి అని తెలియడం ఈ విషాదాన్ని మరింత పెంచింది.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ జిల్లాకు చెందిన రాజేంద్ర (గోలు, 22), కాజల్ పటేల్ (21) మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా జీవిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బుధవారం రాత్రి కూడా అందరితో కలిసి భోజనం చేసి తమ గదిలోకి వెళ్లారు. అయితే, చాలాసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన రాజేంద్ర తండ్రి తలుపు తెరిచి చూడగా, వారు పెళ్లి దుస్తుల్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. రాజేంద్ర పెళ్లి సూట్‌లో ఉండగా, కాజల్ పెళ్లి చీరలో కనిపించడం అక్కడివారిని కంటతడి పెట్టించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో కాజల్ ఒకటిన్నర నెలల గర్భిణి అని తేలింది. ప్రాథమికంగా ఉరి వేసుకోవడం వల్లే మరణించినట్లు కనిపిస్తున్నా, పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తాయని వైద్యులు తెలిపారు.

ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అదనపు ఎస్పీ లోకేశ్ సిన్హా ధ్రువీకరించారు. వారిద్దరూ ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసుకోనున్నట్లు తెలిపారు. 
Rajendra
Rajendra suicide
Kajal Patel
Madhya Pradesh suicide
Sagar district
Couple suicide
Love marriage
Pregnancy
India news
Crime news

More Telugu News