Chowdeswari: మాచర్ల యువతి మృతి మిస్టరీ వీడింది.. పరువు కోసం చంపిన కన్నతండ్రి!

పల్నాడు జిల్లా మాచర్లలో గత నెల 18న జరిగిన యువతి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రేమ వివాహం చేసుకుని పరువు తీసిందన్న కోపంతో కన్న తండ్రే ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఈ దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.

మాచర్లకు చెందిన వ్యాపారి చంద్రశీను కుమార్తె చౌడేశ్వరి (22), అదే ప్రాంతానికి చెందిన నాగరాజు ప్రేమించుకున్నారు. అయితే, తన కుమార్తెను ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తండ్రి నిశ్చయించాడు. నిశ్చితార్థానికి రెండ్రోజుల ముందు చౌడేశ్వరి తాను ప్రేమించిన నాగరాజుతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.

ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన చంద్రశీను.. తన కుమార్తె ఇంట్లోని నగలు దొంగిలించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో ఆమె తాను కట్టుబట్టలతో వెళ్లానని చెప్పింది. దీంతో ఐదు రోజులు పుట్టింట్లో ఉండి, మార్చి 19న భర్త వద్దకు వెళ్లేలా పెద్దలు ఒప్పందం కుదిర్చారు. అయితే, మార్చి 18నే చౌడేశ్వరి అనుమానాస్పదంగా మృతి చెందింది.

పోస్టుమార్టం నివేదికలో ఇది ఆత్మహత్య కాదని తేలడంతో పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించారు. మార్చి 18న భార్య, కుమారుడిని పొలానికి పంపి, మేనల్లుడు పచ్చిపాల శీనుతో కలిసి నిద్రిస్తున్న కుమార్తె ముఖంపై దిండు అదిమి చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కుమార్తె పెళ్లిని ఘనంగా చేయాలనుకున్నానని, కానీ ప్రేమ పెళ్లి చేసుకుని పరువు తీయడంతోనే చంపానని నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. 
Chowdeswari
Macharla
Palnadu district
honor killing
love marriage
father arrested
Andhra Pradesh crime
murder case
police investigation
crime news

More Telugu News