Mamata Banerjee: అదంతా బీజేపీ ప్లాన్.. అధికారుల నిర్బంధం అంశంపై మమత

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల అధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇది పూర్తిగా బీజేపీ పన్నిన కుట్ర అని మమతా బెనర్జీ ఎదురుదాడికి దిగారు. మాల్దాలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకోవడాన్ని సహించబోమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించింది. అధికారులకు వెంటనే తగిన భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ‘‘అక్కడ అధికారులను ఎవరు అడ్డుకున్నారో మాకు తెలియదు. ఇదంతా బీజేపీ సృష్టించిన గేమ్ ప్లాన్. తప్పుడు ఫిర్యాదులతో రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆమె ఆరోపించారు. ఎన్నికల వేళ ఉద్రిక్తతలు సృష్టించేందుకు కేంద్ర బలగాలతో కలిసి బీజేపీ కుట్ర చేస్తోందని, మాల్దా ఘటన అందులో భాగమేనని ఆమె విమర్శించారు.

మాల్దాలో ఎన్నికల అక్రమాలపై సమీక్షించేందుకు వెళ్లిన అధికారుల బృందాన్ని స్థానికులు గుంపుగా చుట్టుముట్టి, వారి వాహనాలను కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ వివాదం మొదలైంది. ప్రస్తుతం బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో ఈ ఘటన రాజకీయంగా మరింత వేడి పుట్టించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Mamata Banerjee
West Bengal
Supreme Court
BJP
Malda
Election Commission
Election Violence
Bengal Elections
Political Conspiracy
Central Forces

More Telugu News