Chiranjeevi: అయోధ్య తరహాలోనే.. తన ఇంట్లోని దైవిక దృశ్యాన్ని పంచుకున్న చిరంజీవి.. వీడియో వైర‌ల్‌!

దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అచంచల భక్తిని చాటుకుంటూ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఇంటి పూజా మందిరంలో ఏటా జరిగే ఓ అద్భుత దృశ్యాన్ని ఆయన అభిమానులకు చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు సూర్యకిరణాలు ఇంద్రధనస్సులోని సప్తవర్ణాల్లా మారి, తమ పూజగదిలోని ఆంజనేయస్వామి విగ్రహాన్ని పైనుంచి కింద వరకు తాకుతాయని చిరంజీవి వివరించారు. ఈ అద్భుత దృశ్యం మాటల్లో చెప్పలేని ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని వివరిస్తూ, ఇటీవ‌ల అయోధ్యలో బాలరాముడి విగ్రహంపై పడిన 'సూర్య తిలకం'ను ఆయన గుర్తుచేసుకున్నారు. కోణార్క్, అరసవిల్లి వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లోనూ ఇలాంటి దైవిక కిరణాలు దర్శనమిస్తాయని, అలాంటి అద్భుతమైన అనుభూతిని తన ఇంట్లోనే పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని చిరంజీవి అన్నారు.

చిరంజీవికి చిన్నప్పటి నుంచి ఆంజనేయస్వామిపై ఉన్న భక్తి, విశ్వాసం గురించి అందరికీ తెలిసిందే. తన ప్రతి విజయానికీ ఆ స్వామి ఆశీస్సులే కారణమని ఆయన బలంగా విశ్వసిస్తారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా చిరంజీవి గుర్తుచేసుకున్నారు. చదువుకునే రోజుల్లో ప్రతిరోజూ హనుమంతుడి గుడికి వెళ్లేవాడినని, జీవితంలో ఎలాంటి కష్టమొచ్చినా స్వామిని తలచుకుంటే చాలు, పరిష్కారం దొరుకుతుందని తన జీవితానుభవాన్ని పంచుకున్నారు.

ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు మెగాస్టార్ భక్తిని ప్రశంసిస్తూ, ఆయనకు హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Chiranjeevi
Hanuman Jayanti
Ayodhya
Surya Tilakam
Anjaneyaswamy
Viral Video
Spiritual Experience
Hindu Temple
Religious

More Telugu News