Supreme Court: న్యాయాధికారుల నిర్బంధం.. బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Supreme Court Angered by Bengal Government Over Judicial Officers Detention
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో ఏడుగురు న్యాయాధికారులను గంటల తరబడి బందీలుగా పట్టుకున్న ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం న్యాయాధికారులను భయపెట్టే ప్రయత్నమే కాదని, సుప్రీంకోర్టు అధికారానికే సవాల్ విసిరేలా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దర్యాప్తును తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే... ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తమ పేర్లను తొలగించారంటూ ఆగ్రహించిన కొందరు నిరసనకారులు.. మాల్దాలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను బుధవారం మధ్యాహ్నం ఘెరావ్ చేశారు. దాదాపు 9 గంటల పాటు వారిని నిర్బంధించారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో భారీ పోలీస్, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగి వారిని సురక్షితంగా విడిపించాయి. అధికారులను అక్కడి నుంచి తరలిస్తుండగా వారి వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "సాయంత్రం 5 గంటలకు అధికారులను నిర్బంధిస్తే, రాత్రి 11 గంటల వరకు వారికి సహాయం అందలేదు. ఇది సాధారణ ఘటన కాదు. న్యాయాధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసి, కొనసాగుతున్న ప్రక్రియను అడ్డుకోవడానికి ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా చేసిన దాడిలా కనిపిస్తోంది" అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వయంగా డీజీపీ, హోం సెక్రటరీకి ఫోన్ చేయాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.

ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన విధిని నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. అధికారులకు భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇకపై అభ్యంతరాల స్వీకరణ సమయంలో ఇద్దరు, ముగ్గురి కంటే ఎక్కువ మందిని అనుమతించరాదని, విచారణ కేంద్రాల వద్ద ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ సమయంలో బెంగాల్ అడ్వొకేట్ జనరల్ జోక్యం చేసుకోగా, సీజేఐ తీవ్రంగా స్పందించారు. "దురదృష్టవశాత్తు మీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజకీయ భాషలోనే మాట్లాడతారు. దేశంలోనే అత్యంత ధ్రువీకరించబడిన రాష్ట్రం మీది. అర్ధరాత్రి 2 గంటల వరకు నేనే స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాను. ఆ దుండగులు ఎవరో మాకు తెలియదనుకుంటున్నారా? ఇది చాలా దురదృష్టకరం" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.
Go Back to Shorts
Supreme Court
West Bengal
Malda
Judicial officers
CBI investigation
NIA investigation
Voter list
Chief Justice of India
Surya Kant

More Telugu News