SPB Statue: కేరళ గడ్డపై గాన గంధర్వుడు.. పాలక్కాడ్‌లో ఎస్పీబీ విగ్రహావిష్కరణ

గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సంగీతానికి భాషతో సంబంధం లేదని నిరూపిస్తూ, కేరళ గడ్డపై ఆయన భారీ విగ్రహం కొలువుదీరింది. పాలక్కాడ్‌లోని వీటీ భట్ట తిరిప్పాడ్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఎస్పీబీ 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయకులు మనో, చిత్ర, హరిహరన్, సుజాత మోహన్, విజయ్ ఏసుదాస్ సహా పలువురు సినీ సంగీత ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సంగీత మేఘం’ పేరిట ఓ ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి, తమ గానంతో బాలుకు స్వర నివాళి అర్పించారు. ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్ ఈ విగ్రహాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 

గతంలో హైదరాబాద్‌లో ఎస్పీబీ విగ్రహ ఏర్పాటు విషయంలో ప్రాంతీయ వాదాలతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే, తెలుగు రాష్ట్రాలకు భిన్నంగా పరాయి రాష్ట్రమైన కేరళలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా బాలు విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆయన కీర్తికి దక్కిన నిజమైన గౌరవమని సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కళాకారుడికి హద్దులుండవని కేరళ ప్రజలు చాటి చెప్పారని ప్రశంసిస్తున్నారు.

16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఎస్పీబీ... నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. 2020లో కరోనాతో ఆయన కన్నుమూసినప్పటికీ, తన గానంతో సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కేరళలో ఈ విగ్రహావిష్కరణ ఆయన అజరామరమైన కీర్తికి నిదర్శనంగా నిలుస్తుంది.
SPB Statue
SP Balasubrahmanyam
Palakkad
Kerala
SP Charan
MM Keeravani
Music legend
Unni Kanayi
Playback singer
Musical tribute

More Telugu News