Nara Lokesh: లోక్ సభలో అమరావతి బిల్లు పాస్.. టీవీ లైవ్ చూసి చప్పట్లు కొట్టిన లోకేశ్... ఫొటోలు ఇవిగో!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంటులో ఆవిష్కృతమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సభలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న దృశ్యాలను తన ఫోన్‌లో వీడియో తీశారు.

‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గతంలో చేసిన ఏకగ్రీవ తీర్మానానికి అనుగుణంగా, అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును నేడు లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది.

ఈ చారిత్రక సందర్భంపై లోకేశ్ స్పందిస్తూ, ఇది ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే రోజని అభివర్ణించారు. "నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - నా రాజధాని అమరావతి" అని ప్రతి ఒక్కరూ చెప్పుకునే రోజు ఇదని అన్నారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల విజయమని, రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులని, శాంతియుత పోరాటానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు.

అమరావతి బిల్లుకు మద్దతుగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి, ఇతర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతి నిలిచిందని పేర్కొంటూ, "జై ఆంధ్రప్రదేశ్.. జయహో అమరావతి" అని నినదించారు.

"అమరావతి చట్టబద్దత బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమ‌రావ‌తి చ‌రిత్ర‌-సంస్కృతి, ఆవ‌శ్య‌క‌త స‌భ్యులు వివ‌రిస్తుంటే  ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్క‌బొడుచుకున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం, దేశంలోని వివిధ పార్టీలు నిల‌వ‌డం ఐదుకోట్ల ఆంధ్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు అద్దం ప‌ట్టింది. లోక్ స‌భ వేదిక‌గా అమ‌రావ‌తి గొప్ప‌త‌నం దేశ‌మంత‌టికీ మ‌రోసారి ప‌రిచ‌య‌మైంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌జాస్వామ్య దేవాల‌యం పార్ల‌మెంటులో చ‌రిత్ర సృష్టించిన అమ‌రావ‌తి చ‌ట్ట‌బ‌ద్ధ‌త బిల్లు చ‌ర్చ‌లో పాల్గొన‌కుండా వైసీపీ స‌భ్యులు వాకౌట్ చేయ‌డం వారి ద్రోహ‌బుద్ధికి నిద‌ర్శ‌నం. జ‌గ‌న్ ఎన్ని జ‌న్మ‌లెత్తినా అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక‌నూ తాక‌లేడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధినీ ఆప‌లేడు. నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాశ్వ‌తం, నా రాజ‌ధాని అమ‌రావ‌తి అజ‌రామ‌రం" అంటూ లోకేశ్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

Nara Lokesh
Amaravati
Andhra Pradesh
AP Capital
Lok Sabha
Capital Bill
Andhra Politics
AP Assembly
Development Decentralization
One State One Capital

More Telugu News