Chandrababu Naidu: రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఏప్రిల్ 1) నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు విభిన్నమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఒకవైపు సంక్షేమానికి, మరోవైపు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొదట నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. అనంతరం కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టకు చేరుకుని, శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం ద్వారా పేదలకు పెద్ద ఎత్తున నగదు బదిలీ జరుగుతోంది. గడిచిన 22 నెలల్లోనే ప్రభుత్వం పింఛన్ల రూపంలో లబ్ధిదారులకు రూ.60,437 కోట్లను అందించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు గానూ రాష్ట్రవ్యాప్తంగా 62.60 లక్షల మంది పింఛనుదారులకు రూ.2,724 కోట్లను విడుదల చేసింది. సీఎం పర్యటించనున్న నెల్లూరు జిల్లాలో 2.91 లక్షల మందికి రూ.128 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గంలో 39,330 మందికి రూ.17.81 కోట్లు, వింజమూరు మండలంలో 5,484 మందికి రూ.2.47 కోట్లు పింఛన్ల రూపంలో అందనున్నాయి.

సీఎం పర్యటన సాగేదిలా...

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు వింజమూరుకు చేరుకుంటారు. అక్కడి ఉత్తర ఎస్సీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:15 గంటలకు ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు.

వింజమూరు పర్యటన ముగించుకుని, సాయంత్రం 4:25 గంటలకు సీఎం చంద్రబాబు కడప జిల్లా ఒంటిమిట్టకు చేరుకుంటారు. సాయంత్రం 6:15 గంటలకు కోదండరామస్వామి వారిని దర్శించుకుని, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత 6:45 గంటలకు కల్యాణ వేదిక వద్ద జరిగే శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో తన అర్ధాంగి భువనేశ్వరితో కలిసి పాల్గొంటారు. స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందజేస్తారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి బుధవారం రాత్రి ఒంటిమిట్టలోనే బస చేయనున్నారు.
Chandrababu Naidu
NTR Bharosa Pension
Andhra Pradesh
Nellore District
Kadapa District
Ontimitta Temple
Sita Rama Kalyanam
Pension Distribution
Welfare Schemes

More Telugu News