Prakash Raj: నటుడు ప్రకాశ్ రాజ్ కు సానుభూతి తెలిపిన జగన్
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత (86) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పట్ల వైసీపీ అధినేత జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ప్రకాశ్ రాజ్, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని, మనోబలాన్ని ప్రసాదించాలని జగన్ ఆకాంక్షించారు. సువర్ణలత గారి ఆత్మకు శాంతి చేకూరాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మాతృ వియోగం అనేది ఎవరూ పూడ్చలేని లోటని, ఈ కష్ట కాలంలో ప్రకాశ్ రాజ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సువర్ణలత ఈ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.