Fake robbery: ఇన్సూరెన్స్ డబ్బు కోసం చోరీ నాటకం!

ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ మహిళ భారీ దొంగతనం నాటకం ఆడి, చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. తనను నలుగురు దుండగులు బంధించి, రూ.27 లక్షల విలువైన బంగారం దోచుకెళ్లారని ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇంట్లోని సీసీ కెమెరా ఫుటేజీ ఆమె బండారాన్ని బయటపెట్టింది.

వివరాల్లోకి వెళితే.. కోరుకొండ మండలం కాపవరానికి చెందిన ముండ్రు పద్మ అనే మహిళ ఈ నెల 26న పోలీసులను ఆశ్రయించింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు తన కాళ్లు, చేతులు కట్టేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో భాగంగా ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

ఆ ఫుటేజీలో, పద్మనే స్వయంగా ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేయడం, సీసీ కెమెరా వైర్లను తొలగించడం స్పష్టంగా రికార్డయింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని అంగీకరించింది. 15 రోజుల క్రితం కొనుగోలు చేసిన బంగారంపై బీమా ఉందని, ఆ డబ్బు కోసమే ఈ నాటకం ఆడినట్లు ఒప్పుకుంది. రూ.20 వేలు దాటిన వస్తువు కొంటే ఏడాదిపాటు బీమా వర్తిస్తుందని తెలుసుకుని ఈ పథకం రచించినట్లు తెలిపింది.

తప్పుడు ఫిర్యాదు చేసిన పద్మపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని క్రైం డీఎస్పీ సుభాష్ మీడియాకు వెల్లడించారు. చాకచక్యంగా ఈ కేసును ఛేదించిన సీఐ మూర్తి, ఆయన సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.
 
Fake robbery
Mundru Padma
Insurance fraud
Fake robbery
East Godavari
Andhra Pradesh
Crime news
Police investigation
Gold theft
Insurance claim
Korukonda

More Telugu News