Maneka Gandhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో వీధికుక్కల సంరక్షణ, గోవుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా చర్చించారు.

రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నియంత్రణ, గోశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మేనకా గాంధీకి వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీధికుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమ వివరాలను ఆమెకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా గోవుల సంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. ఎన్.కె. పల్లిలో ఆధునిక వసతులతో విశాలమైన ప్రాంగణంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆలయాల సమీపంలో గోశాలలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జంతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆమె ప్రశంసించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగా, శనివారం నగర పర్యటనలో భాగంగా మేనకా గాంధీ ఒక యానిమల్ అంబులెన్స్‌ను ప్రారంభించారు. అనంతరం బేగంబజార్‌లో నిర్మాణంలో ఉన్న మల్టీ స్పెషాలిటీ యానిమల్ ఆసుపత్రి పనులను పరిశీలించారు. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తికానుండటంపై ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Maneka Gandhi
Revanth Reddy
Telangana
stray dogs
Goshala
animal welfare
animal rights
GHMC
Sridhar Babu
animal ambulance

More Telugu News