Reeta: పొరపాటున రూ.10 కోట్లు ఖాతాలో పడితే... ఆ డబ్బు నాది కాదు, వెనక్కి తీసుకోండన్న మహిళ!

ఉత్తరప్రదేశ్‌లోని ఓ సామాన్య రైతు భార్య ఖాతాలో ఏకంగా రూ.10 కోట్లు జమ అయ్యాయి. అయితే, ఆశకు పోకుండా ఆమె చూపిన నిజాయతీ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఊహించని విధంగా వచ్చి పడిన కోట్లను చూసి చలించకుండా, ఇది తనది కాదని బ్యాంకుకు తెలిపేందుకు సిద్ధపడింది.

వివరాల్లోకి వెళితే.. మైన్‌పురి జిల్లా, బిచ్వాన్ ప్రాంతంలోని దేవ్‌గంజ్ గ్రామానికి చెందిన రీతా అనే మహిళ నవరాత్రి అష్టమి రోజున బ్యాలెన్స్ చెక్ చేసేందుకు సమీపంలోని ఏటీఎంకు వెళ్లింది. తన ఖాతాలో రూ.9,99,49,588 ఉన్నట్లు చూసి షాక్ అయింది. అనుమానంతో మరో ఏటీఎంలో చెక్ చేయగా, అదే మొత్తం కనిపించింది. వెంటనే తన కుటుంబ సభ్యులను హెచ్చరించిన ఆమె, "ఈ డబ్బు మనది కాదు, ఒక్క రూపాయి కూడా తాకొద్దు" అని స్పష్టం చేసింది.

ఆ రోజు బ్యాంకుకు సెలవు కావడంతో అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వలేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న కరీంగంజ్ బ్రాంచ్ మేనేజర్ రిషికాంత్ పాండే, ఇది సాంకేతిక లోపం వల్లే జరిగిందని, బ్రాంచ్ తెరిచిన తర్వాత దాన్ని సరిదిద్దుతామని తెలిపారు.

రీతా నిజాయతీ గురించి తెలియగానే గ్రామస్థులు, చుట్టుపక్కల వారు ఆమెను అభినందించారు. ఆమె ఏటీఎంలో రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా ఆమె సత్యసంధతను కొనియాడుతున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఓ సామాన్య కుటుంబం ఇంత పెద్ద మొత్తాన్ని చూసి చలించకపోవడం అందరికీ స్ఫూర్తినిస్తోంది.
Reeta
Uttar Pradesh
Mainpuri district
Bank account
10 crore rupees
ATM
Branch manager
Technical issue
Honesty
Farmer

More Telugu News