రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. మద్యం స్కామ్ ద్వారా వచ్చిన ముడుపులతో రాజ్ కేసిరెడ్డి తన తల్లిదండ్రుల పేరిట తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా షాబాద్‌లో తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరుతో కొన్న 17.60 ఎకరాల భూమి అసలు మార్కెట్ విలువ దాదాపు రూ. 70 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం రూ. 2.69 కోట్లుగా చూపించారు. అలాగే జనగామలో తండ్రి ఉపేంద్ర రెడ్డి పేరుతో లక్షల విలువైన ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు.


ఈ బినామీ ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డికి సంబంధించి వందల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ, సిట్ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా గుర్తించిన రూ. 70 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయాలని సిట్ నిర్ణయించింది. దీనికోసం అనుమతిని కోరగా... ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 



More Telugu News